పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత – రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖమాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక
సంక్షేమశాఖమాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
చెప్పారు. ‘ స్వచ్ఛతాహి సేవా – 2025 ‘ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో  పనిచేస్తున్న పరిశుద్య కార్మికులకు బుధవారం ఒంగోలు పాత జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ‘ సఫాయి మిత్ర సురక్ష సివిర్ – ప్రత్యేక మెగా వైద్య శిబిరము ‘ ను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయకుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెడుతున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ప్రతినెలా నాలుగో శనివారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులను ఆయా పంచాయతీల కార్యదర్శులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీలలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులతో సమానంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా
ఇన్సూరెన్స్  కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పి.పి.ఈ. కిట్లను సక్రమంగా వినియోగించుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.
             జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆత్మస్థైర్యంతో, ఆత్మ గౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోగాల బారిన పడకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులే ప్రజలకు దేవుళ్ళు అని ఆయన వ్యాఖ్యానించారు. సేవల నిమిత్తం ఆసుపత్రికైనా, ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్లి గుర్తింపు కార్డు చూపిస్తే విఐపి లకు ఇచ్చే గౌరవాన్ని పారిశుధ్య కార్మికులకు కూడా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణలో ప్రకాశం జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉండేలా కార్మికులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
              సంతనూతలపాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాలను శుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపులో జాప్యం లేకుండా ప్రభుత్వం చూస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం సమకూర్చిన పి.పి.ఈ. కిట్లను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
             డిపిఓ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రిమ్స్, కిమ్స్, శ్రీరామ్, ఆస్టర్ రమేష్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులతో ఈ శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా క్లాప్
మిత్రలు 1820 మంది, పారిశుద్ధ్య కార్మికులు 1215 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ కొబ్బరి నూనె, సబ్బులు, మాస్కులు, యూనిఫారాలు, యాప్రాన్లు, చెప్పులు, హ్యాండ్ గ్లోవ్స్ ఇస్తున్నట్లు వివరించారు. వీరికి ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పి.పి.ఈ. కిట్లు అందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకరరావు, డీ.ఎం.హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.లక్ష్మా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *