గత రెండు సంవత్సరాలకు పైగా ఒంగోలులో ఆధ్యాత్మిక దీప్తిని వెలుగొందింపచేస్తూ అత్యంత శోభాయమానంగా భక్తి ప్రపత్తులతో సామూహికంగా నామస్మరణ చేస్తూ భక్తులందరూ స్వామివారి ప్రతిమను పల్లకిలో ఉంచి పల్లకి మోస్తూ గోవింద నామస్మరణ చేస్తూ గోమాత, స్వామి వారి శ్రీవారి దండం ధరించిన భక్తులు మంగళ వాయిద్యముల నడుమ శ్రీగిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేసి శ్రీగిరి పై కొలువైన శ్రీనివాసుని దర్శించే అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నదని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.
ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున విజయదశమిగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో జరుపుకోవడం అదే రోజు శ్రవణా నక్షత్రం రావడం అత్యంత పవిత్రమైన దినంగా పేర్కొన్నారు. ఆ అద్భుతమైన పర్వదినం గురువారం శ్రవణా నక్షత్రంతో కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొనుటకు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కోర్టు సెంటర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం కేశవ స్వామి పేట భగీరథ మహర్షి సెంటర్, శర్మ కాలేజ్ రోడ్డు, గద్దలగుంట, రాజా పానగల్ రోడ్డు మీదుగా గిరిప్రదక్షిణ పూర్తిచేసుకుని శ్రీవారిని దర్శించుకొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, శెట్టి రామునాయుడు, సెనెగేపల్లి నాగాంజనేయులు, బాదం మురళి, తాత విజయ్ కుమార్, కనమర్లపూడి చంద్రశేఖర్, తదితరులు పాల్గొని కార్య నిర్వహణ చేశారు.






