జాతిపిత మహాత్మా గాంధీ ఒక వ్యక్తి కాదని…. ఒక ఆలోచనా విధానమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అన్నారు. మహాత్ముని ఆలోచనలు, ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని చెప్పారు. గాంధీజీ 156వ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యం, అహింస, ఓర్పు, సహనం, దృఢ సంకల్పానికి గాంధీజీ నిదర్శనమని చెప్పారు. అహింస కాకుండా శాంతి మార్గం ద్వారా దేనినైనా సాధించవచ్చు అని గాంధీజీ మన దేశానికి స్వాతంత్ర్యం ద్వారా నిరూపించారని అన్నారు. క్షణికావేశంలో అహింస, నేరానికి పాల్పడిన ఖైదీలను కూడా గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో నడిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కారాగారాలను పరివర్తన కేంద్రాలుగా ప్రభుత్వం మార్చుతున్నట్లు చెప్పారు. జైలు జీవితం అనంతరం సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, కుటుంబానికి అండగా ఉండేలా ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చేందుకే ఖైదీల సంక్షేమ దినాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ దిశగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం తీసుకోవాలని ఖైదీలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జైళ్ళ సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, ఆయుష్ విభాగ సీనియర్ డాక్టర్ భ్రమరాంబ, డిటిసి సుశీల, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, జైలు డాక్టర్ బ్రహ్మతేజ, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖైదీల సంక్షేమ దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన వారికి కలెక్టర్ చేతుల మీదగా బహుమతులు ప్రదానం చేశారు. నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను కలెక్టర్ సత్కరించారు.

