పి 4 లో భాగంగా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం త్రిపురాంతకం మండలం దూపాడు డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటగది పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ. ……… పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీ 4 కార్యక్రమంలో బాగంగా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అందులో భాగంగానే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య అధికారిని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం రూ.143 కోట్లతో గురుకులాలు, వసతి గృహాలకు మరమ్మత్తులు చేశామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడలు శరీర దృఢత్వానికి, మానసిక ఆనందానికి తోడ్పడతాయన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కష్టపడి చదివి తల్లిదండ్రులకు కలలు నెరవేర్చాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు.


