వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. రోజువారీ కార్యక్రమాలలో ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ” స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడవ శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈనెల ‘ క్లీన్ ఎయిర్ ‘ ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని సూచించారు. కార్యాలయాలకు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లేవారు దగ్గరలో అయితే నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాలని పిలుపునిచ్చారు. దూరమైతే వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తద్వారా పర్యావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మరోవైపు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పారు. కలెక్టర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు కూడా కలెక్టరేట్లో మొక్కలు నాటారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఈవో కిరణ్ కుమార్, సిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవికుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాలినడకన కలెక్టర్ !
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వాయు కాలుష్యాన్ని తగ్గించేక్రమంలో ఇతర అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు కలెక్టర్ రాజా బాబు. తన నివాసం నుంచి కలెక్టరేటుకు కారులో కాకుండా
నడుచుకుంటూ వచ్చారు. ఉన్నతాధికారులు కూడా తమ ప్రవర్తన ద్వారా సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ సూచించారు. పెట్రోలు, డీజిల్ వాహనాలు కలెక్టరేటులోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.


