కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహయజమానుల ఇంటి సమస్యలను పరిష్కరించేం దుకు నిర్వహించిన స్వామిత్ర సర్వేపూర్తయిన తరువాత యజమానులకు సమాచారం ఇవ్వకుండా గ్రామ సభలు జరపటం వల్ల ప్రయోజనం వుండదని జడ్పీ టీసీ మారం వెంకటరెడ్డి అన్నారు. తాళ్లూరు-1 సచివాలయం వద్ద స్వామిత్ర గ్రామ సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జడ్పిటిసి మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్వేపూర్తయిన తరువాత ఇంటి యజమానులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటి సర్వేలు పూర్తి చేసి వివరాలు,హద్దులు గుర్తించారో లేదో యజమానులకు నోటీస్ ద్వారా తెలపక పోతే ఎలా తెలుస్తుందన్నారు. స్వామిత్రా సర్వే తప్పులతడ కగా జరిగితే అందుకు బాధ్యత పంచాయతీకార్యదర్శి, గ్రామ సర్వేలు వహించాల్సి వస్తుందన్నారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన కైపు రామకోటిరెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో స్వామిత్ర సక్రమంగా జరుగ లేదన్నారు. సర్వే పూర్తయినట్లు చూపితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, సర్వే సక్రమంగా చేసి ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చిన తరువాత వివరాలు వెల్లడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.అజిత గ్రామసర్పంచ్ చార్లెస్ వేస్లీ, వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, నాయకుడు ఐ.శ్రీనివాసరెడ్డి, వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి షేక్ షహనా జ్బేగం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభకు కేవలం 30 మంది మాత్రమే రావటం గమనార్హం.

