రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్… ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం…రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బ‌దిలీ. మెరుగ్గా మెట్రో విస్తర‌ణ ప‌నులు, ప్రణాళిక‌, సేవ‌లు.

హైద‌రాబాద్‌ , ఏప్రిల్ 28, (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టి ఆధీనంలో ఉన్న మెట్రో రైలును స్వాధీనం చేసుకుంది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను Hyderabad Metro Rail Limited ద్వారా స్వాధీనం చేసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ‌తంలోనే నిర్ణయించింది. ఈ మేర‌కు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేప‌థ్యంలో HMRL ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, L&T, LTMRHL ప్రతినిధులు బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశంలో Larsen & Toubro Limited, L&T Metro Rail (Hyderabad) Limited సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం LTMRHLకు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై HMRL తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, L&T Ltd త‌ర‌ఫున‌ డి.కె.సేన్, LTMRHL త‌ర‌ఫున‌ కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో LTMRHL పై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును (2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా IDBI Capital వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను Saraf & Partners సంస్థ అందించింది.ప్రయాణికుల‌కు అనుకూలంగా హైద‌రాబాద్‌లో L&T Metro Rail (Hyderabad) Limited సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II నెట్‌వర్క్ రూప‌క‌ల్పన‌, ప‌నులు, ప్రణాళిక‌, అమలు, సేవల అందజేతలో సమన్వయంసాధ్యమవుతుంది. భ‌విష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధార‌ప‌డద‌గిన‌, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముఖ్యమంత్రితో ఎల్ అండ్ టీ ఛైర్మన్ భేటీ ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఎల్ అండ్ టీ ఛైర్మన్‌, ఎండీ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై వారిద్దరి మ‌ధ్య చ‌ర్చలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *