తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్.టి.రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బి.ఎన్.విజయకుమార్ లతో కలసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎన్.టి.రామారావు జయంతి వేడుకులను అధికారికంగా జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ….నటనలో తన విశ్వరూపం చూపిన అన్న ఎన్టీర్ రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా నిలిచారన్నారు. అదే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పయనిస్తున్నారన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం లో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటునట్లు తెలిపారు. నందమూరి తారక రామారావు యుగపురుషుడు, సినీ రంగంలో రారాజుగా వెలుగొండిన వ్యక్తి, వారు రాజకీయాల్లో వచ్చిన తరువాత ఆనాటి పరిస్థితుల్లో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు సమాన హక్కు కల్పించడం, పక్కా గృహల నిర్మాణాలు వంటి ఎన్నో పథకాలు ఈ రోజుకు అమలు జరుగుచున్నాయన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ పర్సన్ ఇంచార్జి డా కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచరిత్ర, ఒంగోలు మార్కెటింగ్ చైర్మన్ వెంకటరావు, మాజీ నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


