భూ సమస్యల పరిష్కారంలో ప్రజా సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి తో కలిసి రాష్ట్రంలో 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే , రెవెన్యూ సమస్యలపై పిజిఆర్ఎస్ లో ఆర్జీల పరిష్కారం, సీజనల్ కండిషన్స్(ప్రకృతి వ్యవసాయ పద్ధతి, వాతావరణ మార్పుల నుంచి పంటలను కాపాడటానికి ) నీట్ పరీక్షలు, చేపట్టవలసిన చర్యలు తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంలో ప్రజా సంతృప్తి పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 22ఏ భూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏదైనా భూ సమస్యపై అర్జీ వచ్చినప్పుడు, సంబంధిత తహసిల్దార్ కచ్చితంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన గడువు లోపు రీ సర్వే ప్రక్రియ పూర్తీ చేయాల్సిందిగా సూచిస్తూ అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ‘ఎల్ నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (సుమారు 50 శాతం వరకు లోటు) నమోదయ్యే అవకాశం ఉన్నందున, ‘ఎల్ నినో’ ప్రభావం వ్యవసాయ రంగంపై పడకుండా క్షేత్ర స్థాయిలో ఇప్పటి నుండే ముందస్తు ప్రణాలికలు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోతహించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని, జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించడం జరిగింది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, జిల్లా వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, కలెక్టరేట్ రెవెన్యూ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


