ఒంగోలులో రూ. 4 కోట్ల 40 లక్షలతో డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలు నిర్మాణం కోసం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఒంగోలులోని యువ భవన్ స్థలంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…పేదల విద్య, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. 2014 – 19 లో టీడీపీ ప్రభుత్వం ఒంగోలులో యువ భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తే.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందన్నారు. నేడు ఆ సైట్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఒంగోలులో ఈ ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే రూ. 100 కోట్లతో పలు భవనాలు నిర్మించినట్టు మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఐఐటీ, నీట్, ఎక్సలెన్సీ సెంటర్లను ఈ నెలలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
