ఘనజీవామృతం పంటలకు అమృతం లాగా పనిచేస్తుందని మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాద్ రావు అన్నారు. మండలంలోని నాగంబొట్లవారిపాలెం గ్రామంలో సోమవారం రైతు భరోసా కేంద్రం నందు ఏపీ ప్రకృతి వ్యవసాయ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమంలో ఘన జీవామృతం తయారీ విధానాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలలు, పంటలు, పర్యావరణం, ఆరోగ్యం సక్రమంగా ఉండడానికి ఘనజీవామృతం చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
నాటు ఆవు పేడ, మూత్రం, బెల్లం, పుట్ట మట్టి, తదితర వాటి మిశ్రమాన్ని ముద్దలుగా చేసి నీడలో 7 రోజులు ఎండబెట్టి, తదుపరి వాటిని పొడి గోనె సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఆరు నెలల వరకు ఇది నిల్వ ఉంటుందని ఆయన సూచించారు. ఎకరాకు 100 కిలోల వంతున దక్కి
దున్నే సమయంలో ఉపయోగించాలని, తర్వాత పంట సాగు చేసిన పిదప ఒక నెలలోపు పంటసాళ్లులో దీనిని ఉపయోగించినట్లయితే ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సాగు మండల ఇంచార్జ్ నరసింహులు, గ్రామ వ్యవసాయ సహాయకులు డి శ్రీను, ఐసిఆర్సిలు నరేష్, మురళి, కోటి, రవి, సుశీల, శ్రావణి, రైతులు ఎల్ శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
