రాజకీయ కుట్రలో భాగంగానే ఎం.పి. మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారని రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మాగుంట కుటుంబం ఎప్పుడూ తప్పుచేయదని బాలినేని స్పష్టం చేశారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎం.పి. మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయటం జరిగింది. దీంతో నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎం.పి. మాగుంటను శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో కలిసి సంఘటనపై పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఎం.పి. మాగుంట శ్రీనివాసులురెడ్డిని మనోధైర్యంతో ఉండాలని బాలినేని తెలిపారు. అనంతరం మాగుంట కార్యాలయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఎన్నో ఏళ్ళుగా మాగుంట కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తుందని బాలినేని అన్నారు. 1991లో జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. 32 సంవత్సరాల మాగుంట కుటుంబ రాజకీయ జీవితంలో జిల్లాలో ఎవరితోను విభేదాలు లేకుండా రాజకీయాలు నడిపారన్నారు. జిల్లా ప్రజలు మాగుంట కుటుంబానికి అండగా ఉంటారని, మేమంతా మాగుంట కుటుంబం వెంట నడుస్తామని బాలినేని తెలిపారు. కన్న కుమారుడు అక్రమ కేసులో ఇరుక్కున్నప్పుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి మనస్సు కుదుట పర్చుకుని, మనోధైర్యంతో ఉండాలన్నారు. ఆయన కోసం ఏమి చేసేందుకైనా వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి అక్రమ కేసులకు అధైర్యపడకుండా మనోనిబ్బరంతో ఉండాలన్నారు. రాఘవరెడ్డిని తప్పకుండా రాజకీయాల్లోకి తీసుకువచ్చి జిల్లాలో రాజకీయ భవిష్యత్తు కల్పించటం జరుగుతుందన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మీద అనేక అక్రమ కేసులు నమోదు చేసిన మనో ధైర్యంతో సి.ఎం. అయ్యారని బాలినేని తెలిపారు. మంచినీటి, విద్యా దాత, మాగుంట కుటుంబం వెంట వైసీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు ఉండాలని బాలినేని అన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, ఎ.ఎం.సి. మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, కఠారి శంకర్, తాతా ప్రసాద్, కుప్పా రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మిశెట్టి మాధవి, వాయల మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.