మాదక ద్రవ్యాలు వాడటం వలన విద్యార్థులకు, పౌరులకు ,ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని దర్శి సీఐ జే రామకోటయ్య అన్నారు. మండలంలోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద గల వేదా ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఏ ఎం ఎం ఎస్ సుధాకర్ బాబు అధ్యక్షతన, మాదక ద్రవ్యాలపై జిల్లా ఎస్పీ మల్లికా గర్గో ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ … మత్తు పదార్థాలైన గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి మొత్తు పదార్థాలతో విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వలన గుండె, లివర్, మెదడు ,కిడ్నీలు చెడిపోతాయని, దాంతో మనిషి మరణ దశకు చేరతారని అన్నారు. అనుకోకుండా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. దీంతో మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ రోడ్లు పాలు కావాల్సి వస్తుందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉద్యోగం సాధించాలనే ఆశతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ, ఎల్ సంపత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


