జిల్లాలోను,రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, వసతిగృహాలు, పునరావాస కేంద్రాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(1,2,3)కి వ్యతిరేకంగా కుల, మత ప్రస్తావనలు తెచ్చే ఉపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి,జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి. పద్మావతి తెలిపారు.
సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ… ఇటీవల వైఎస్సార్ జిల్లా బుకాయి పల్లి జరిగిన అన్యమత ప్రచారంతో పాటు మరిన్ని జిల్లాల స్కూళ్లు ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు కోకొల్లలుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు అందుతుండడం విచారకరమని అన్నారు.
సున్నిత మనస్కులైన విద్యార్థులకు విద్యతో పాటు నీతి, న్యాయం, నైతిక విలువలు, సేవా తత్పరతను పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది తర్ఫీదునివ్వాలని సూచించారు, అలా కాకుండా కేవలం మత సంభందిత అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ఇబ్బంది కల్గించే విధంగా ప్రవర్తిస్తు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.
అలాగే హిందూ, క్రైస్తవం, సిక్కు, ముస్లిం, ఇస్లాం, జైస్ తదితర మతాలకు చెందిన ప్రచారాలు రాజ్యాంగానికి, విద్యావ్యవస్థ సంప్రదాయాల నిబంధనలకు పూర్తి విరుద్ధమని అన్నారు, దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మధ్య అన్యమత ప్రచారాలు చేయాలని చూస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సస్ కేసలి అప్పారావు నేతృత్వంలో చట్ట ప్రకార చర్యలుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాల్సి ఆవశ్యకతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పద్మావతి తెలిపారు. అన్యమత ప్రచారం చేస్తున్నట్టు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టికొస్తేapscpcr2018@gmail.com కు ఫిర్యాదులందిస్తే కమిషన్ సత్వరమే స్పందించి చర్యలు చేపడుతుందని అన్నారు.
