పేద కుటుంబాలలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి “వై.ఎస్.ఆర్. కాపు నేస్తం” పధకం ఎంతో ఉపయోగపడుతోందని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు.
వరుసగా నాలుగో ఏడాది అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో శనివారం నగదు జమ చేస్తున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒడా ఛైర్మన్ మీనా కుమారి, రాష్ట్ర ఎస్.సి. కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట్ల రవిబాబు, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును వారు అందించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… వై.ఎస్.ఆర్. కాపు నేస్తం ద్వారా 45 నుండి 60 సంత్సరాలలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.15 వేలను వారి ఖాతాలలోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈ పథకం ద్వారా 8,707 మంది లబ్ధిదారులకు రూ.13.06 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ఈ నగదును మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గంగాడ సుజాత మాట్లాడుతూ…. కాపుల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశ పెట్టినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకునే గొప్ప ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు.
ఒడా ఛైర్మన్ మీనాకుమారి మాట్లాడుతూ….. వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పథకం పేద కుటుంబాలలోని మహిళల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతుందని అన్నారు. కాపులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఆమె అన్నారు.


