మొక్కజొన్న పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుందని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్య నుండి రైతులు బయటపడవచ్చు అని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. తాళ్లూరు, కొత్తపాలెం గ్రామాలలో బుధవారం ఆయన క్షేత్ర పర్యటన సందర్భంగా మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు మాట్లాడుతూ …. తాళ్లూరు మండలంలో 500 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటను రైతులు నేడు పండిస్తున్నారని ఆయన తెలిపారు. మొక్కజొన్నలో పయనీర్, అడ్వాంటా, భారతి తదితర రకాల మొక్కజొన్న పంటలు వివిధ దశలలో ఉన్నాయని ఆయన తెలిపారు. మొక్కజొన్న పంట కండె దశలో ఉన్న సమయంలో అడవి పందుల బెడద తీవ్రతరంగా ఉంటుందని దీని నుండి బయటపడడానికి వైరుతో అమర్చిన వలలను కర్రల ద్వారా గట్టిగా పొలం చుట్టూ పాతాలని ఆయన తెలిపారు. నూలు దారం, పురికొస ఉపయోగించి పాత చీరలను చుట్టూ కట్టినట్లయితే వాటి నుండి నివారించవచ్చని ఆయన తెలిపారు. దారానికి పంది నూనెను పూసి కట్టినట్లయితే కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా కత్తెర షాపులో నుండి వెంట్రుకలను తెచ్చి పొలం గట్లపై అక్కడక్కడ ఉంచి నట్లయితే అడవి పందుల నుండి రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు . కార్యక్రమంలో ఏఈఓ నాగరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.
