ప్రభుత్వం జగనన్న పాల వెల్లు వ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమూల్ పాల కేంద్రాలకు పాలు పోసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు అన్నారు. మండలంలోని సింగన పాలెం గ్రామంలో బుధవారం ఆ గ్రామ సర్పంచి కందిమల్ల గీతాంజలి అధ్యక్షతన మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జగనన్న పాల వెల్లువద్వారా రాయితీ రుణాలు అందిస్తారని, ఆ రుణాలతో పాడి గేదెలు కొనుగోలు చేసి పాలను అమూల్ పాల కేంద్రాలకు పోసి మీ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచు కోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు డైరీలకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమూల్ పాల కేంద్రాల పాలు పోసే రైతులకు అధిక ధర ఇస్తున్నారని అన్నారు. పాడి రైతులకు రెండు లక్షల నుండి 20 లక్షల వరకు పిడి సీసీ బ్యాంకు ద్వారా రాయితీ రుణాలు అందిస్తూన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సిద్దయ్య, పశువైద్యాధికారిని ఎం విజయలక్ష్మి, రూట్ ఇన్చార్జి నాగేశ్వరరావు, వెలుగు సిసి గురవయ్య, రైతులు మహిళలు పాల్గొన్నారు.
