గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం గడపాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా మండలంలోని దోసకాయలపాడులో ఏర్పాటు చేసిన గణనాధుని గురువారం జడ్పీచైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…. సమాజం లో ఐక్యమత్యాన్ని చాటేందుకు వినాయక చవితి నవరాత్రుల వేడుకలు నిమజ్జనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎటువంటి బేధాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో కలసి జీవించాలని అన్నారు. ఉత్సవాల స్పూర్తితో గ్రామాలలో ప్రజలు సోదరభావాన్ని పెంపొందించుకుని స్నేహపూర్వక వాతావరణంతో కలిసి మెలసి జీవించాలని అన్నారు. గణేశుని కృపతో అందరికి మంచి జరగాలని కాంక్షించారు. సర్పంచ్ కోట శివలక్ష్మి, వెంకట రామిరెడ్డి, మేకల కొండయ్య విగ్రహ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం నిమజ్జనోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, మాజీ సొసైటీ డైరక్టర్ గువ్వల వెంకట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


