తాళ్లూరు మండలం రామభద్రపురం వొద్ద జరిగిన హత్య కేసులో నిందితుడైన బాలుడిని పోలీ సులు అరెస్టు చేశారు. కేవలం మూడొందల రూపాయల కోసం కడ తేర్చినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను దర్శి సీఐ రామకోటయ్య శుక్రవారం వివరించారు. బిహార్ కు చెందిన పాశ్వాన్ రాజన్ (21) బతుకుదెరువు కోసం తాళ్లూరు మండలం రామభద్రాపురానికి వచ్చి సారెడ్డి వెంకటరెడ్డికి చెందిన డెయిరీ ఫారం లో పనిచేస్తున్నాడు. బిహార్ కు చెందిన ఓ బాలుడు ఉపాధి కోసం అద్దంకి, తూర్పు గంగవరం ప్రాంతాల్లో నెల రోజులుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తమ రాష్ట్రానికే చెందిన కైలాష్ అనే వ్యక్తి వద్దకు చేరాడు. అతను ఆ బాలుడిని పాశ్వాన్ కు
పరిచయం చేశాడు. ఈ క్రమంలో బాలుడు తన ఖర్చులు నిమిత్తం రాజన్ నుంచి రూ.300 అప్పు తీసుకున్నాడు. సెప్టెంబరు 14 అర్ధరాత్రి రామభద్రాపురంలో పాశ్వాన్ రాజన్, బాలుడు కలిశారు. తన డబ్బులు ఇవ్వాల్సిందిగా రాజన్ పట్టుబట్టడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు ఇనుపరాడ్ తో రాజన్ తలపై మోదడంతో అతను మృతి చెందగా, నిందితుడు పరారయ్యాడు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నిందితుడిని సీఐ రామకోటయ్య అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐతో పాటు ఇన్ ఛార్జి ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
రూ. మూడొందల కోసం కడతేర్చాడు – బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
07
Oct