ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలు యాక్సెప్టెన్స్ టెస్ట్ (ఏ.పి.టి.) ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. స్థానిక మామిడిపాలెంలోని ఈ.వి.ఎం. గోదాములో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం ఆయన పరిశీలించారు. బెల్ కంపెనీ నుంచి వచ్చిన ముగ్గురు సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో 80 మంది సచివాలయ సిబ్బంది, 40 మంది వి.ఆర్.ఏ.ల సహకారంతో ఏ.పి.టి. నిర్వహిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వి.వి. ప్యాట్ల పరిశీలన ఇప్పటికే పూర్తి చేశామని, కంట్రోల్ యూనిట్ల పరిశీలన పూరైందని, బ్యాలెట్ యూనిట్లకు ఏ.పి.టి. మంగళవారంతో పూర్తి అవుతుందని చెప్పారు. జిల్లాకు వచ్చిన వాటిలో రెండు బ్యాలెట్ యూనిట్లు, నాలుగు కంట్రోల్ యూనిట్లకు సంబంధించి తయారీ లోపం ఉన్నట్లు నిపుణులు గుర్తించారని, వీటిని తిరిగి కంపెనీకి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏ.పి.టి. పూర్తి చేశాక ఈ నెల 16వ తేదీ నుంచి ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్.ఎల్.సి.) చేపడతామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఆర్. శ్రీలత, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు,
కలెక్టరేట్లోని ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.జె.పి. నుంచి
బి. రాజశేఖర్ (జిల్లా కార్యదర్శి), గుర్రం సత్యం (ఐ.టి. విభాగ ప్రతినిధి), టి.డి.పి. నుంచి కాలేషా బేగ్ ఉన్నారు.



