స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో “డయల్ యువర్ కలెక్టర్”, “స్పందన” కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …స్పందనలో వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. అర్జీల పరిష్కారంలో పారదర్శకత ముఖ్యమన్నారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని ఆయన చెప్పారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు క్లుప్తంగా వివరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ముందుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ప్రజలు ఫోన్ ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. వీటిపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
- కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామం నుంచి పి. వెంకటరామిరెడ్డి ఫోన్ చేశారు. తమ భూమిని ఆన్ లైన్ చేయడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని కొమరోలు మండల తహశీల్దార్ ను ఆదేశించారు.
- పొన్నలూరు మండలం బైరెడ్డిపాలెం గ్రామం నుంచి బ్రహ్మయ్య ఫోన్ చేశారు. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేశానని, దానికి సంబంధించిన నగదు ఇంకా తమకు జమ కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
- పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామం నుంచి వై. నరశింహారావు ఫోన్ చేశారు. తమ గ్రామంలో కరెంటు స్తంభం డ్యామేజీ అయిందని, కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
- పొదిలి మండలం నవమిట్ట నుంచి కె. బహుదుల్లా ఫోన్ చేశారు. తమ పొలంలోని పైరును పాడు చేశారని, విచారణ జరిపి తనకు న్యాయం చేయవలసినదిగా కోరారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, డి.ఆర్.ఓ. కె.శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, లోకేశ్వరరావు, వర కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.