పోలింగ్ ముగిసింది. ఉత్కంఠ పెరుగుతోంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉంది. గెలుపుపై ఇరు పార్టీల్లో ధీమాలు కనిపిస్తున్నాయి. ఈ సారి భారీ మెజార్టీలు కనిపించడం లేదు. ఎవరు గెలిచినా పది వేల లోపే అనే చర్చలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలపై ఇప్పుడు ఎవరికీ ఆశల్లేవు. అన్నిచోట్లా గట్టిపోటీలు కొనసాగాయి. ఎక్కువ స్థానాలు గెలుస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. పోలింగు సరళిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తెరపైకి అంచనాలు వచ్చాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనే దానిపైనే వాడివేడిగా విశ్లేషణలు మొదలయ్యాయి.-
పోలింగ్ బూత్ ల వారీగా తమకు పడ్డ ఓట్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. సామాజిక తరగతుల వారీగాను
క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై బూత్ ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. వీటి
ఆధారంగానే గెలుపు, ఓటములపై ఓ అవగాహనకు వస్తున్నారు. భారీ పోలింగును ఎవరికివారే తమకు అనుకూలంగా భావిస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు, వ్యాపారవర్గాలు,- ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, -నిరుద్యోగులు ఎక్కువశాతం ఎటు వైపు మొగ్గు చూపారనే చర్చ సాగుతోంది. బయట నుంచి వచ్చిన ఓటర్లపై ఇరుపార్టీల అభ్యర్థులూ ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ఆర్సిపి కి పేదవర్గాల నుంచి, మహిళల నుంచి ఓటింగు ఎక్కువగా పడిందనే అంచనాల్లో ఉన్నారు. పార్టీ పునాది ఓటింగు రీత్యా తూర్పు నియోజకవర్గాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు. పశ్చిమప్రాంతం వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా పడ్డట్లు చెబుతున్నారు. తెలుగుదేశం నేతలు ఆరుస్థానాలపై గట్టి ధీమాతో ఉండగా వైసిపి నేతలు కూడా ఒకటి మినహా మిగిలినవన్నీ గెలుస్తామని చెబుతున్నారు. చెరో రెండు స్థానాలు ఓడిపోతాయనే అంచనాల్లో మాత్రం స్పష్టంగా ఉన్నారు. మంత్రులు పోటీ చేసిన కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గా ల్లోనూ పోలింగు ప్రతిష్టాత్మకంగానే జరిగింది. ఇక్కడ తెలుగుదేశం గట్టి ఆశల్లో ఉంది. కనిగిరి, 1గిద్దలూరు స్థానాలపైనా తెలుగుదేశం స్పష్టంగా ఉంది. ఒంగోలులో గట్టిపోటీ ఉందనే అంచనాల్లో ఉన్నారు. ఇక్కడ ఇరువురూ ధీమాలో ఉన్నారు. వైపాలెం, మార్కాపురం, దర్శి, ఒంగోలులో గెలుపుపై వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గట్టి ధీమాలో ఉన్నారు. ఇలా ఎవరికి వారే ఆరుస్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ స్థానంలో పోటీ చూస్తే తెలుగుదేశం నుంచి పోటీలో ఉన్న సిట్టింగు ఎంపీ మాగుంట, వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య రసవత్తమైన పోరు జరిగింది.
కొండపి, ఒంగోలుతో పాటు పశ్చిమాన కొన్నిచోట్ల క్రాస్ఓటింగు పడిందనే చర్చ వినిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనివిధంగా బియ్యం బస్తాలు, నూనె ప్యాకెట్లు, చికెన్ , చీరలు వంటివి కూడా అందించారు. ఇవి ఎంత మేరకు ఓటర్లపై ప్రభావం చూపుతాయనేదీ చూడాలి. పేదల్లోనే ఇలాంటివి పంచారు. ఆఖరు నిమిషంలో మేనిఫెస్టోలు, పథకాలపై ఆశలు తగ్గాయి. డబ్బుల పైనే అభ్యర్థులు ఆధారపడ్డారు. నోటు ఇస్తేనే ఓటు అనే భావనకు వచ్చేశారు. అందుకే రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ ఇచ్చారు. పంవకాలపైనే ధీమాతో కొందరున్నారు. ఏదేమైనా పోలింగ్ సరళిని బట్టి ఎవరు గెలుస్తారు? ఎవరు కష్టమనేదీ చర్చలు జోరుగా రాజకీయ వర్గంలో సాగుతున్నాయి. గెలుపోటములపై భారీగా పందెం రాయుళ్లు సైతం పందాలు పెడుతూ సై.. రాజా ..సై అంటున్నారు. బెంగళూరు హైదరాబాదు ప్రధాన కేంద్రాలుగా ఈ పందాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతుంది.
