తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ యూనివర్శిటీలకు త్వరలో వైస్ ఛాన్సలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించనున్న విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీని ఏదైనా ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించాలని ఓయూ విద్యార్థులు మరియు మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత బీఆర్ఏస్ ప్రభుత్వం ఒక్క యూనివర్శిటీకి కూడా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ గా నియమించలేదనీ. ఈ విషయంలో మైనారిటీలలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్నారు. దీన్ని గమనించిన సీఏం రేవంత్ రెడ్డి గత రంజాన్ మాసంలో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ. రాష్ట్రంలోని ఏదైనా ఒక యూనివర్శిటీకి ముస్లింను వైస్ ఛాన్సలర్ గా నియమిస్తామని ప్రకటించారన్నారు. ఈ మాట ప్రకారం ప్రొ. మహమ్మద్ అన్సారీకి అవకాశం ఇవ్వాలని మైనారిటీ విద్యార్థులు , నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రొ. మహమ్మద్ అన్సారీకి ఉద్యమాల చరిత్ర ఉంది.ఆయన ఖమ్మం నుండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యాభ్యాసం చేశారు. తను చదువుతున్నపుడు జరిగిన అనేక విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. తను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలోనే అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. వందలమంది విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు నాయకులుగా తీర్చిదిద్దారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులతో మమేకమై క్రియాశీలకంగా పనిచేశారు. ఉద్యమంలో ఓయూ జేఏసీ ఏర్పాటులో మహమ్మద్ అన్సారీ పాత్ర కీలకమైంది. అనేకమంది విద్యార్థులు ఉద్యమంలో జైలుకు వెళ్లిన సమయం లో తన సొంత ఖర్చులతో వారికి బెయిల్ ఇప్పించి విడుదల చేయించారు. రాష్ట్రంలో జరిగిన అనేక బహుజన, మైనారిటీ ఉద్యమాలకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. పదేళ్ల బీఆర్ఏస్ ప్రభుత్వంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. బీఆర్ఏస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు జరిగిన అన్యాయాలను ఎండ గడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. ముస్లిం జేఏసీ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, అనేక సభలలో ప్రసంగించారు. బీఆర్ఏస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ముస్లింలను కోరారు. ప్రొ.మహమ్మద్ అన్సారీ ఉద్యమ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వైస్ ఛాన్సలర్ గా అవకాశం ఇవ్వాలని పలువురు విద్యావంతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.
