శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడశుద్ధ ఏకాదశి “తొలి ఏకాదశి” (శయన ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు సాయి కృష్ణ వ్రతము ఆచరించ విచ్చేసిన దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలను వివరిస్తూ వ్రతములు చేయవలసిన ఆవశ్యకతను అర్ధవంతముగా వివరించారు. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరింపకున్ననూ వ్రత ప్రసాదమును స్వీకరించినంతనే స్వామి వారు భక్తుల ఆకాంక్షలను నెరవేరుస్తారని స్వామి వారి ప్రసాదం మహిమను తెలియజేశారు. కావున ఏ సమయమునైననూ వ్రతము చేయవలెనన్న సంకల్పము కలిగిన వెంటనే వ్రతం ఆచరించిన యెడల అద్భుతమైన ఫలితాలను పొందగలమని వివరించారు. సాధ్య సాధ్యాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సంవత్సరమునకు ఒక్కసారైనా తమ ఇంట గాని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలలో కానీ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ భక్తబృంద ఏర్పాటు చేసిన తొలి ఏకాదశి పర్వదిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత కార్యక్రమంతో భక్తియుతంగా ముగిశాయి. పెద్ద సంఖ్యలో దంపతులు స్వామివారి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.


