భగవత్ సాక్షాత్కారం కోసం చేసే వ్రతాలలో ఙ్ఞానదశను దాటించి ప్రేమదశకు చేర్చే అత్యున్నత వ్రతం తిరుప్పావై వ్రతమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, స్వర్ణకంకణ గ్రహీత పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులోని గీతామందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం 24వ రోజుకు చేరుకుంది. ఈ పాశురం పోత్తి పాశురంగా, మంగళశాసన పాశురంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఈ సందర్భంగా భక్తబృందం గోదాదేవిగా, శ్రీకృష్ణుడు వేషధారణలతో మురిపించి గీతా మందిరాన్ని బృందావనంలా మరిపించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి స్వామి వారికి సామూహికంగా హారతులుపట్టారు. ఈ కార్యక్రమంలో గీతామందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, దోగిపర్తి సుబ్రమణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్, చీమకుర్తి శివ తదితరులు పాల్గొన్నారు.
*సంతపేట సాయిబాబా మందిరంలో…*
సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు 24వ పాశురం ప్రాశస్త్యాన్ని వివరించారు. భక్తబృందం ఆధ్వర్యంలో స్వామి వారికి హారతులు పట్టి గోవిందనామ స్మరణ చేశారు. ముందుగా తిరుప్పావై పాశురాలను గోష్టి గానం చేశారు. సంతపేట సాయిబాబా మందిరం ఆండాళ్ సేవాసమితి నిర్వాహకురాలు దామచర్ల ప్రసన్నకుమారి, అర్చకులు సుధాకర్, సాయి, రామకృష్ణ పూజా కార్యక్రమలను నిర్వహించారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


