ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి అన్నీ విభాగాల హెచ్ఓడిలతో సమావేశమై, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై క్షుణ్ణంగా సమీక్షించారు. సంబంధిత డాక్టర్లు, అధికారులతో విభాగాల వారీగా ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ వివరాలు సమీక్షించి, లోపాలను సరిచూసుకుని వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలన్నారు. వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పర్ఫామెన్స్ ఇండికేటర్స్ లో మంచి ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్ , వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఓపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, ఐపి సేవలు సామర్ధ్యాన్ని పెంచాలన్నారు. రోగులకు వసతులు కల్పించుటలో ఆసుపత్రులకు కావలసిన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అస్సుపత్రిలో చేపట్టాల్సిన మరమత్తులు తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎపిఎంఎస్ఐడిసి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కావలసిన ఎక్విప్మెంటు, వైద్య పరికరాలు కొనుగోలుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సుపరింటెండెంట్ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో హాస్పటల్ సూపరింటెండెంట్ డా. జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఏడుకొండలు, ఎపిఎంఎస్ఐడిసి అధికారులు, వివిధ విభాగాల హెచ్ఓడి లు తదితరులు పాల్గొన్నారు.


