దేశంలోని శైవక్షేత్రాల్లో ఎక్కడ జరగిన విధంగా భూకైలాసం అయిన శ్రీశైల పుణ్యక్షేత్రం మాత్రమే పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా అర్థరాత్రి జరిగే పాగాలంకరణ మహోత్సవంలో ఆయన వ్యాఖ్యాతగా పాల్గొని శివతత్వం, శివరాధన వల్ల కలిగే ఫలితాలు, శ్రీశైల మహత్యం గురించి వివరించినట్లు తెలిపారు. గురువారం ఒంగోలులో ఏర్పాటుచేసిన మీడియా మిత్రులు సమావేశంలో వారు మాట్లాడుతూ… శ్రీశైల మల్లన్న పాగాలంకరణ కార్యక్రమంలో తనతోపాటు ప్రముఖ వ్యాఖ్యతలు మహంతయ్య, హయగ్రీవాచార్యులు, గొగ్గి బలరామాచార్యులు పాల్గొని లింగోద్భవం, శివపార్వతుల కల్యాణం, నాలుగు యుగాలలో శివారాధన తదితర అంశాలపై వ్యాఖానం చేశారు. శివరాత్రి మహోత్సవాల స్పెషల్ అధికారి చంద్రశేఖర ఆజాద్ అనుసంధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో బుట్టే పంచాంగ రచయిత బుట్టే వీరభద్ర దైవఙ్ఞ, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ మెంబరు మఠం విరూపాక్షయ్య పాల్గొని మాట్లాడారు. శ్రీశైల దేవస్థానం ఇ.ఒ ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మాచార్యులు వ్యవహరించారు. ఈ సందర్భముగా తనకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించిన శ్రీశైలం దేవస్థానం వారికి పొన్నూరు వేంకట శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

