హైదరాబాద్, ఏప్రిల్ 14, (జె ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడికి అరుదైన క్యాన్సర్.బారిన పడ్డాడు.
అదీ బాగా ముదిరిన దశలో ఉంది.సాధారణంగా 15 ఏళ్లలోపు పిల్లలకే వచ్చే న్యూరోబ్లాస్టోమా అనే ఈ క్యాన్సర్. పది లక్షల మంది పిల్లల్లో కేవలం 8 మందిలో మాత్రమే కనిపిస్తుంది.ఇది తెల్సిన ఆ కుటుంబం బాబును పట్టుకుని పలు ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో.చివరి ఆశగా అతడి తల్లిదండ్రులు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ అతడికి శస్త్రచికిత్స చేసిన ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మధు దేవరశెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు.
హైదరాబాద్ లాలాపేట్ ప్రాంతానికి చెందిన ‘‘రక్షిత్ అనే రెండేళ్ల అబ్బాయికి న్యూరోబ్లాస్టోమా చాలా ముదిరిన దశలో ఉంది. న్యూరోబ్లాస్టోమా అనేది నాడీ కణజాలం నుండి అభివృద్ధి చెందే ఒక అరుదైన క్యాన్సర్. ఇది సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథి (మూత్రపిండాల పైన) యొక్క నరాల కణజాలంలో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఇది మెడ, ఛాతీ లేదా పెల్విస్ యొక్క నరాల కణజాలాలలో కూడా ప్రారంభమవుతుంది. ఈ అబ్బాయిలో మాత్రం శరీరం దిగువ భాగాల నుంచి గుండెకు చెడురక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం (ఇన్ఫీరియర్ వెనా కావా-ఐవీసీ)తో పాటు కుడి మూత్రపిండాన్ని కూడా దాదాపు ఆనుకుని ఉంది. దాంతో అతడికి శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిష్టంగా మారింది. తొలుత కీమోథెరపీతో కొంతవరకు నయం చేయచ్చేమో అనుకున్నాం. కానీ, దానికి కణితి ఏమాత్రం స్పందించలేదు. దాంతో శస్త్రచికిత్స తప్పనిసరైంది. కానీ, కణితి తొలగించేటప్పుడు కిడ్నీ కూడా తీసేయాల్సి వస్తుందేమో అనిపించింది. కానీ, మా బృందంలోని వైద్యులంతా అత్యంత నైపుణ్యంతో, ఎంతో కష్టపడి.. చివరకు కిడ్నీని తీయకుండా చూడగలిగాం. ప్రభావితమైన రక్తనాళాలను జాగ్రత్తగా తీసేసి, వాటిని మళ్లీ అనుసంధానించాం. ఫలితంగా రక్తసరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకున్నాం. ఈ కేసును మేము సవాలుగా తీసుకొని, విజయవంతంగా పూర్తి చేశాం. శస్త్రచికిత్స తర్వాత రక్షిత్ చాలా వేగంగా కోలుకున్నాడు. దాంతో తర్వాతిరోజే అతడిని గదిలోకి మార్చాం. ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయాలంటే నైపుణ్యం, అనుభవం రెండూ అవసరం. కిమ్స్ ఆస్పత్రిలో అన్ని విభాగాల్లోనూ అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు, అత్యాధునిక సదుపాయాలు, క్రిటికల్ కేర్ నిపుణులు అందరూ ఉండడంతో ఇలాంటి సంక్లిష్టమైన కేసుల్లో చికిత్స సాధ్యమవుతోంది. పీడియాట్రిక్ ఆంకాలజీ విభాగంలో ఈ అత్యాధునిక సేవల వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలం’’ అని డాక్టర్ దేవరశెట్టి మధు వివరించారు.
మా కుమారుడికి ఏమీ తెలియని వయసులోనే ఇంత పెద్ద కష్టం వచ్చింది. ఎక్కడ తిరిగినా ప్రయోజనం కనపడకపోవడంతో చివరి ఆశగా కిమ్స్ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ దేవరశెట్టి మధు, ఇతర వైద్యులు కలిసి చాలా పెద్ద ఆపరేషన్ చేసి మా అబ్బాయిని మళ్లీ మా కళ్లముందు నిలబెట్టారు. దేవుడి దయ, వైద్యుల నైపుణ్యం వల్లే ఈ రోజు మళ్లీ మా అబ్బాయిని చక్కగా చూసుకోగలుగుతున్నాం. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, ఆస్పత్రి యాజమాన్యానికి ఎంతలా కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు’’ అని రక్షిత్ తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
