బేగంపేట ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
ఆరోగ్య పరమైన సమస్యలు ఏర్పడినప్పుడు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహించవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో ఇరువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఒక లక్ష 75 వేల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు పత్రాలను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని సి లైన్ దర్గా బస్తీకి చెందిన భాగ్యలక్ష్మి గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతుంది. వైద్యుల వద్దకు వెళ్ళగా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో బాగ్యలక్ష్మి, ఆమె భర్త రాజ్ కమల్ లు టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఆపరేషన్ కోసం సహాయం అందించాలని రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో లక్ష రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు కాగా భాగ్యలక్ష్మి భర్త రాజ్ కమల్ కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అదేవిధంగా బేగంపేట డివిజన్ లోని పాటిగడ్డ కు చెందిన సాజిదా బేగం చికిత్స కోసం 75 వేల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు కాగా, ఆమె భర్త వాజిద్ కు ఎల్ ఓ సి ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, బేగంపేట కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు టి.శ్రీహరి, ఆరీఫ్, నాయకులు జనార్ధన్, నర్సింగరావు, విట్టల్, శివ కుమార్, చందు, రాజు తదితరులు ఉన్నారు.

