కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు గిరిజనులకు పూర్తి స్థాయిలో అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.ఎం. జన్ మన్, డీ.ఏ. జె.జీ.యూ.ఏ. పథకాల అమలులో పురోగతి, క్షేత్రస్థాయిలో సమస్యలు తదితర అంశాలపై బుధవారం ప్రకాశం భవనములో ఆమె సమీక్షించారు. ఆయా పథకాల కింద జిల్లాలోని గిరిజన ప్రాంత మండలాల్లో హౌసింగ్, రోడ్డు సదుపాయం, తాగునీరు, విద్యుత్ సదుపాయం, బహుళ ప్రయోజనాల కేంద్రాల నిర్మాణం, వందన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు, మొబైల్ కనెక్టివిటీ, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు , ఆధునీకరణ, వంట గ్యాస్ సదుపాయం, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. వీటి పురోగతిని ఐటిడిఏ పిఓ శివప్రసాద్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు.
దీనిపై ఆమె స్పందిస్తూ ఆగష్టు 15 నాటికి గృహ ప్రవేశం చేసేలా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర సదుపాయాల కల్పనలోనూ పురోగతి కనిపించాలని చెప్పారు. మొబైల్ టవర్స్, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి త్వరగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా అప్పటికప్పుడే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్. ఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఈ బాల శంకరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీ రాణి,
జిల్లా పౌరసరకాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, డీ.ఏస్.వో. పద్మశ్రీ, ఐసిడిఎస్, బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.


