ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి బైక్ ర్యాలీ అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. హిందూ బంధువులు, అమ్మవారి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు మణిశర్మ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కాషాయపతాకాలను చేపట్టి, పసుపు మరియు ఎరుపు తలపాగాలను చుట్టి ద్విచక్ర వాహనాలపై 400 మంది పైగా ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీ రోడ్డు, దక్షిణం బజారు, ఏనుగు చెట్టు వీధి, పప్పు బజార్, పత్తి వారి వీధి, పాత కూరగాయల మార్కెట్, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, రాంనగర్ మొదటి లైన్ మీదుగా… ట్రంక్ రోడ్డు, కలెక్టరేట్, ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్, గ్రంధాలయం మీదుగా లాయర్ పేట చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం మీదుగా… ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్, గాంధీ రోడ్ బంగారుకొట్ల సెంటర్ మీదుగా అమ్మవారి దేవస్థానం వరకు ర్యాలీ జరిగినది. ర్యాలీ లో పాల్గొన్న వారిపై పువ్వులు చల్లే ఏర్పాటు చూపరులను ఆకర్షించినది. ర్యాలీ మార్గం అంతా జై వాసవి జై జై వాసవి నినాదాలతో మార్మోగినది.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారి మన ఒంగోలులో అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీ వాసవి బైక్ ర్యాలీ నిర్వహించడం ముదావహమని కమిటి సభ్యులను అభినందించారు. అమ్మవారు చెప్పిన అహింస, త్యాగం, శాంతి, సహనం లక్షణాలు ప్రతి ఒక్కరు జీవితంలో అలవరచుకోవాలని కోరారు.




