పురోగతి లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం మార్కాపురం మున్సిపల్ పరిధిలోని ఇడుపూరు 1 హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించి ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఇడుపూరు 1 హౌసింగ్ లే అవుట్ లో 2310 ఇల్లు మంజూరు కాగా ఇప్పటివరకు 154 ఇల్లు పూర్తికావడం జరిగిందని, రూఫ్ స్థాయి లో 37, రూఫ్ కాస్ట్ స్థాయిలోకి 430, బి ఎల్ స్థాయిలో 519 ఇళ్ల నిర్మాణాలు పురోగతి లో ఉన్నాయని హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీల గృహనిర్మాణానికి అధనంగా రూ.50 వేలు, ఎస్టీల గృహనిర్మాణానికి రూ.75 వేలు, పివిటిజి(ఆదివాసి గిరిజనులకు) లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. రూఫ్ స్థాయి, రూఫ్ కాస్ట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి త్వరగా సంబంధిత ఇల్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేజి కన్వర్షన్ పై రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఇళ్ళ నిర్మాణాలన పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నారాయణ, తహసీల్దార్ చిరంజీవి, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


