రామ్ గోపాల్ పేట జూన్ 5 (జె ఎస్ డి ఎం న్యూస్)
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమగ్ర నగర ట్రాఫిక్ నిర్వహణ దిశగా చెట్టు మార్పు కార్యక్రమాన్ని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని మంజు థియేటర్ వద్ద రోడ్డుపై ఉన్న పేల్టో ఫోరం చెట్టు ట్రాఫిక్ కు అంతరాయంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు ఆధ్వర్యంలో మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన ఆర్ఎస్ఐ పి. మహేష్, మరియు స్థానిక సామాజిక కార్యకర్తల సహకారంతో, మంజు థియేటర్ లేన్ వద్ద ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పెల్టోఫోరం చెట్టును అన్ని జాగ్రత్తలు.అన్ని రకాలైన అనుమతుల తో మరో ప్రాతం లో నాటేందుకు తరలించారు. ఈ చెట్టు కొమ్మలు వాహనాల గమనానికి అంతరాయం కలిగించడంతో పాటు, ప్రయాణికుల భద్రతకూ ప్రమాదాన్ని కలిగించేవిగా మారాయి. సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొందిన తరువాత, చెట్టును జాగ్రత్తగా మరియు విజయవంతంగా సికింద్రాబాద్ లోని మెహబూబ్ కాలేజ్ ప్రాంగణానికి మార్పు చేశారు. ఈ చర్య పచ్చదనం పరిరక్షణతో పాటు ప్రజల రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర రాజు తెలియజేశారు.
దీంతో తాజ్ బెల్సన్ లేన్ నుండి ప్యారడైజ్ జంక్షన్ దిశగా ట్రాఫిక్ మెరుగుపడటంతో, ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గింది.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆర్.వి. కర్నన్, ఐఏఎస్ కూడా పాల్గొని చెట్టు మార్పు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసుకున్న చక్కటి ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జలందర్ గౌడ్ పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను సూచించేలా ఆయనకు మామిడి మొక్కను బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ జి. శంకర్ రాజు మాట్లాడుతూ, “పర్యావరణ బాధ్యత అనేది కేవలం మొక్కలు నాటడంలోనే కాకుండా, వాటిని కాపాడడం, భవిష్యత్ తరాలకు పరిరక్షించడం కూడా అని అన్నారు.కొత్త ప్రదేశంలో చెట్టు వృద్ధిని పర్యవేక్షిస్తూ, అది ఆరోగ్యంగా పెరిగేలా చర్యలు కొనసాగిస్తామని మరియు ఇది సుస్థిర నగర జీవన విధానం మరియు పచ్చదనం పరిరక్షణ పట్ల ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుందని తెలిపారు.


