ఈనెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు చెప్పారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయం నుంచి
అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ఈనెల 18, 19, 20 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఒక గంట సేపు యోగాసనాలు సాధన చేయించాలని చెప్పారు.
ఆయా విషయాలపై మండల స్థాయి ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్ నిర్వహించి దిశా నిర్దేశం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో చిరంజీవి, ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భీమ్ నాథ్, డిప్యూటీ జిల్లా విద్యాధికారి చంద్రమౌళీశ్వర్, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

