బేగంపేట ,మే 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం ఆన్లైన్ ద్వారా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఎడ్యుకేషన్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అప్పియా చిన్నమ్మ అధ్యక్షత వహించగా, ఆలుమ్ని కన్వీనర్ డా. డి. సరిత సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, భవిష్యత్తు అవకాశాలు మరియు కళాశాలలోని వివిధ క్లబ్ కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రొఫెసర్ అప్పియా చిన్నమ్మ మాట్లాడుతూ.నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి తమ కళాశాల నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు, అధ్యాపకుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలోనే వరుసగా మూడు సంవత్సరాల పాటు నంబర్-1 ప్రభుత్వ అటానమస్ కళాశాలగా గుర్తింపు పొందడం పట్ల సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, డా. మృదుల, డా. నాన్సీ, డా. శారద, డా. కల్పన, లలిత, డా. ప్రసన్నలతో పాటు వివిధ విభాగాల అధిపతులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కళాశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది.


