అమీర్ పేట మే 14,(జే ఎస్ డి ఎం న్యూస్ ):
వాహన దారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించినప్పుడే రహదారి భద్రత సాధ్యమవుతుందని ట్రాఫిక్-2 అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి.వేణుగోపాల్ రెడ్డి ఆన్నారు. బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI) ఆధ్వర్యంలో గురువారం అమీర్పేట్లోని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవరచుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని ఆయన సూచించారు.ట్రాఫిక్ అడ్మిన్ ఏసీపీ జి. లక్ష్మణ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ‘గోల్డెన్ అవర్’లో సహాయం చేయడం ఎంతో కీలకమని వివరించారు. ఆ సమయంలో బాధితులను ఆదుకునే వారికి ప్రభుత్వం ‘రాహ్-వీర్’ (గుడ్ సమారిటన్) అవార్డు కింద ₹25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రంఅందజేస్తుందని వెల్లడించారు. అనంతరం బేగంపేట టిటిఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకాన్ని నివారించడం వంటి అంశాలపై ఉద్యోగులకు విపులంగా అవగాహన కల్పించారు.సదస్సు ముగింపులో ఉద్యోగులందరూ ప్లకార్డులు చేతబూని రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. మహేష్, టాటా ఏఐజీ ప్రతినిధులు గోపాల రావు, సురేష్ బాబు, మరియు టిటిఐ సిబ్బంది సాయికుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

