రాంగోపాల్ పేట్ మే 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
క్షణికావేశంలో ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితతో పాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రామగోపాల్పేట పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. జీడిమెట్లకు చెందిన 23 ఏళ్ల బాధితురాలికి రెండేళ్ల క్రితమే భర్త దూరమయ్యాడు. అప్పటి నుంచి ఆమె తన నాలుగేళ్ల కుమారుడు, ఏడాదిన్నర వయసున్న కుమార్తెతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా ఆమె నడవడికపై అనుమానం పెంచుకున్న కన్నవారు, సోదరుడు తనను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తన ఇద్దరు బిడ్డలతో కలిసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి చేరుకుంది. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న రామగోపాల్పేట పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఆమెను అడ్డుకున్నారు. ప్రాణాపాయం నుంచి ముగ్గురిని రక్షించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం బాధితురాలికి, ఆమె పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు తగిన కౌన్సెలింగ్ ఇచ్చే నిమిత్తం హైదరాబాద్లోని సఖి సెంటర్-II కు తరలించినట్లు రామగోపాల్పేట ఎస్హెచ్ఓ బి. సురేష్ కుమార్ తెలిపారు.
ముగ్గురి ప్రాణాలు కాపాడిన రామగోపాల్పేట పోలీసులు
14
May