గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా మనమిత్ర, అవేర్ యాప్లను వినియోగించుకోవాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అమలు చేస్తున్న ‘ కౌశలం ‘ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ మొబైల్ యాప్స్ ను వినియోగించే తీరుపై స్థానికులకు స్వయంగా కలెక్టర్ అవగాహన కల్పించారు.
గ్రామ సమస్యలు ఇవీ…
👉 ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు
ఎక్కువగా ఉన్నాయని, రీసర్వేలో భూవిస్తీర్ణంలో వ్యత్యాసాలు నమోదు కావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించాలి.
👉 సదరం సర్టిఫికెట్ ఇప్పించాలి.
👉 ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు, రుణాలు విరివిరిగా ఇప్పించాలి.
👉 ఈ గ్రామానికి ఇప్పటివరకు బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం కల్పించాలి.
👉 ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. పరిష్కరించాలి.
👉 ఈ గ్రామంలో అన్నీ రహదారులకు సిమెంట్ రోడ్లు ఉన్నాయి. సైడు కాలువలను నిర్మించాల్సిన అవసరం ఉంది.
👉 ఈ గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రస్తావించిన రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
ముందుగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్సన్, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


