కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. విబిజి రాంజీ పథకం కింద కేటాయించిన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై సోమవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జలధార – జలహారతి, పొలాలలో ఇంకుడు గుంటలు, పశువుల షెడ్లు, ఇళ్లల్లో మురుగునీరు ఇంకుడు గుంటలు, సేంద్రీయ నిల్వలు, పంచాయతీరాజ్ రోడ్లు, మ్యాజిక్ డ్రైనేజీలు, ఇళ్ళ నిర్మాణంలో 90 పని దినాలు, ఉద్యానవనం, అటవీ, ప్రభుత్వ విద్యాలయాల్లో నెట్ జీరో హెల్ది క్యాంపస్ కార్యక్రమం కింద మొక్కలు నాటడం పై ఈ సందర్భంగా కలెక్టర్ చర్చించారు. విబిజి రాంజీ పథక నిధులతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, నివాస కాలనీలకు, స్మశానాలకు రోడ్లు వేయటంపై దృష్టి పెట్టాలన్నారు. రైతులకు మరింత ఆదాయం వచ్చేలా అంతర పంటల సాగుకు అవసరమైన సహాయాన్ని ఈ పథకం కింద అందించాలన్నారు. పాఠశాలలు, బీచ్ లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ఈ పథకం కింద అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన దిశ నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి జోసఫ్ కుమార్, డీ.ఎఫ్.వో.లు రాజశేఖర్, వినోద్ కుమార్, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ జేడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, డిపిఓ అనుపమ, జడ్పీ సీఈవో చిరంజీవి, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, డీఈవో రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, భూగర్భ నీటి వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, ఉద్యాన శాఖ ఏడి గోపీచంద్, సెరికల్చర్ అధికారి సుజన్ కుమార్, ఆర్. డబ్ల్యు . ఎస్ .ఎస్ ఈ. నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

