అల్వాల్ జులై 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలోసంచలనం సృష్టించినహనీట్రాప్, నకిలీ పోలీసుల కిడ్నాప్, దోపిడీ కేసును అల్వాల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.మల్కాజ్గిరి డీసీపీసి.హెచ్. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం గార్లపాటి వెంకట దుర్గ నాగేశ్వర సిద్ధార్థ (40) అనే వ్యాపారవేత్తను వీసా ప్రాసెసింగ్ పేరుతో తోటకూరి గోపీకృష్ణ , చటారి మాధవి అనే నిందితులు ట్రాప్ చేశారు. బాధితుడి కదలికలు, వ్యక్తిగత వివరాలను ప్రధాన నిందితుడైన అల్ నాగరాజు రఘు వర్మ గ్యాంగ్కు చేరవేశారు. దీనిని పథకం ప్రకారం వాడుకున్న నిందితులు గత ఏడాది నవంబర్ 14నమచ్చబొల్లారంలోని ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు సమీపంలో బాధితుడిని అడ్డుకున్నారు. తాముపోలీసులమంటూ నమ్మించి
విచారణ నెపంతో అతడిని స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేశారు.వాహనంలో బాధితుడిని తుపాకీతోబెదిరించి, దాడి చేసిన
నిందితులు అతని వద్ద నుంచి సుమారు 98.3 గ్రాముల (10 తులాల) బంగారు ఆభరణాలు, డెల్ ల్యాప్టాప్, వన్ప్లస్ మొబైల్ ఫోన్ను దౌర్జన్యంగా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా బాధితుడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి రూ. 18 లక్షల నగదును బలవంతంగా వసూలు చేశారు. అనంతరం బాధితుడిని ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని బెర్హంపూర్ అటవీ ప్రాంతంలో వదిలేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిందితులు గోపీకృష్ణ,మాధవిలను జూన్ 23న అరెస్ట్ చేసి
రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు నాగరాజు రఘు వర్మ వేరే కేసులో జగద్గిరిగుట్ట పోలీసులకు దొరికి ప్రస్తుతంజ్యుడీషియల్ కస్టడీలోఉన్నాడు.
పరారీలో ఉన్న
మిగిలిన నిందితుల కోసం అల్వాల్ డీఐ కె. వీరబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ బృందం హర్యానా, చండీగఢ్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్లో భాగంగా చండీగఢ్కు చెందిన సునీల్ ఫౌజీ , హర్యానా కురుక్షేత్రకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రింకు రికీ సంధు , జింద్ జిల్లాకు చెందిన రాజేష్ అలియాస్ సర్పంచ్ లను పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3.5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3.8 లక్షల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం, చోరీకి గురైన మిగతా సొత్తు రికవరీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ప్రాణాంతకమైన ఈ కేసును అల్వాల్ పోలీసులు ఛేదించిన తీరును మల్కాజ్గిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్, అడిషనల్ డీసీపీ కె. రామ్కుమార్, ఏసీపీ పి.గోపాలకృష్ణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన దర్యాప్తు బృందాన్ని అభినందించారు.
