సికింద్రాబాద్, జూలై 18( జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ భోలాక్పూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ‘పింక్ డే’ వేడుకలను ఎంతోఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులచిన్నారులంతా గులాబీ రంగు (పింక్) దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పసిప్రాయంలోనే రంగులపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పింక్ కలర్ బార్బీ డాల్స్, ఆటబొమ్మలు, స్టేషనరీ వస్తువులతో పాటు వివిధ రకాల పండ్లను ఉంచారు. ఆయా వస్తువుల ప్రాధాన్యతను ఉపాధ్యాయులు చిన్నారులకు క్షుణ్ణంగా వివరించారు.
చిన్నారుల్లో సృజనాత్మకతను, పెంపొందించేందుకు ప్రతి వారం ఒక రంగును ఎంపిక చేసుకుని, దానికి సంబంధించిన వస్తువులు, ఆహార పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ రంగుల పండుగ వేడుకల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంచాల వరలక్ష్మి, కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

