పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ప్రతినెల 1వ తేదీన పెద్ద మొత్తంలో ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీయే దీనికి నిదర్శనమని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మితో కలిసి శుక్రవారం ఆయన దర్శి పట్టణంలోని సందువారిపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో వారు ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని కలెక్టర్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలప్రయోజనాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును వారు అందించారు.
అనంతరం పట్టణంలోని రెండవ వార్డు హిందూ స్మశానవాటికకు రూ.49 లక్షలతో నిర్మించిన
ప్రహరీ గోడ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి వెంట ఆర్డిఓ విజయ కుమారి, తహసిల్దార్ రజనీకుమారి, ఇతర అధికారులు ఉన్నారు. తమ ప్రాంతానికి వచ్చిన కలెక్టర్, ఎంపీ, గొట్టిపాటి లక్ష్మీకి స్థానికులు సాదర స్వాగతం పలికారు.





