ఈనెల 30వ తేదీన జరిగే నీట్ – పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శనివారం ఆయన అధ్యక్షతన పరీక్షల నిర్వహణపై ప్రకాశం భవనంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు మొత్తం 434 మంది హాజరుకానున్నారు. దీనికోసం వల్లూరులోని రైజ్ కృష్ణసాయి కాలేజీ, మామిడిపాలెం జంక్షన్ సమీపంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా, ఒంగోలు నగరంలోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ దృష్ట్యా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పోలీసు బందోబస్తు, అభ్యర్థుల కోసం బస్సుల రాకపోకలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యము, త్రాగునీరు, వైద్య శిబిరం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పివి రమణ, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఏపీసిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, ఒంగోలు డి.ఎస్.పి. శ్రీనివాసరావు, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దారులు, పరీక్షలు జరిగే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
