పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం కందుకూరు, అద్దంకి డివిజన్లలోని రెవెన్యూ, సర్వే అధికారులకు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆమె పాల్గొని వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీలో పురోగతి ఉండాలన్నారు. భూ యజమానుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆమె చెప్పారు. డెడ్ లైన్ వరకూ వేచి చూడకుండా రీసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. మండలాలవారీగా పురోగతిని ఈ సందర్భంగా ఆమె సమీక్షించారు. మ్యుటేషన్లు కూడా సకాలంలో జరగాలన్నారు. నిషేధిత 22(ఏ) జాబితాలో ఉన్న పట్టా భూములను పరిశీలించి త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలన్నారు. ‘ మీకోసం ‘ రెవెన్యూ అర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. ఎక్కువ అర్జీలు వస్తున్న మండలాలవారీగా వచ్చే వారం నుంచి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.
ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, డిఆర్ఓ పి.వెంకటరమణ, అద్దంకి ఆర్డిఓ విజయ జ్యోతి కుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, సర్వే శాఖ సహాయ సంచాలకులు రమణ, తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

