రాంగోపాల్ పేట
సెప్టెంబర్ 12 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ (SMCCoM) ఆధ్వర్యంలో ఎంబీఏ ఓరియంటేషన్ డే కార్యక్రమం శనివారం మారియన్ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేరిన ఎంబీఏ విద్యార్థులకు కళాశాల విద్యా వాతావరణం, సంస్థ విలువలు, అభ్యసన అవకాశాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో ఎంబీఏ విద్య ప్రాధాన్యతను వివరించారు. సంస్థల అభివృద్ధికి నైపుణ్యం కలిగిన మేనేజ్మెంట్ నిపుణులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉత్పాదకత పెంపు, మానవ వనరుల నిర్వహణ, సమర్థవంతమైన వ్యాపార వ్యూహాల రూపకల్పన, మార్కెట్ పరిస్థితుల అవగాహన, నూతన ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఎంబీఏ పట్టభద్రులు సంస్థలకు విలువైన సేవలు అందించగలరని తెలిపారు.
ఎస్ ఎం సి కామ్ (SMCCoM) డైరెక్టర్ రెవ. ఫాదర్ డా. పి. ఆంథోనీ వినయ్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఎంబీఏ విద్య కేవలం ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా, నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు నైతిక విలువలను పెంపొందించిసమర్థవంతమైన భవిష్యత్ మేనేజర్లుగా తీర్చిదిద్దుతుందని ఆయన పేర్కొన్నారు.ఓరియంటేషన్ కార్యక్రమం విద్యార్థులకు వారి ఉన్నత విద్యా ప్రయాణానికి ఒక ప్రేరణాత్మక ప్రారంభాన్ని అందించింది. విద్యా ప్రావీణ్యం, నాయకత్వం, ఆవిష్కరణలు,పారిశ్రామికవేత్తల దృక్పథం మరియు బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


