జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పాల్గొనే ఉపాధి కూలీల సంఖ్య రోజుకు లక్ష్య మందికి పెంచటమే లక్ష్యంగా ఉపాధి సిబ్బంది పనిచేస్తున్నట్లు డ్వామా పీడీ శ్రీనా రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే పనులను అధికంగా ఎంఎన్ఆర్ఈజీఎస్ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 50వేల మంది పనులలో పాల్గొంటున్నారని అన్నారు. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్కువ మంది ఉపాధి పనులలో పాల్గొంటున్నారని, వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టినట్లయితే కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కొర్రపాటి వారి పాలెం మైనర్ కాలువ ప్రాంతాలలో చేపట్టిన కాలువల పూడిక తీత పనులను పరిశీలించారు. కొలతలు ప్రకారం పనులు చెయ్యాలని, ప్రతి రోజు రెండు పూటలు పనిచెయ్యాలని కోరారు. అనంతరం ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఎపీడీ కె పద్మశ్రీ, ఎపీఓ మురళి, ఈసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
