స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ని స్పందన హాలులో “డయల్ యువర్ కలెక్టర్”, “స్పందన” కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్పందన అర్జీల పరిష్కారంలో పారదర్శకత ముఖ్యమన్నారు. అర్జీదారులకు సంతృప్తికరంగా సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని ఆయన అన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ప్రజలు ఫోన్లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. వీటిపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
- త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామం నుంచి టి. పెదవెంకయ్య ఫోన్ చేశారు. తమ భూమిని ఆన్ లైన్ చేయడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ తగు విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని త్రిపురాంతక మండల తహశీల్దారు ఆదేశించారు.
- పుల్లలచెరువు మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామం నుంచి ఏ. లక్ష్మీ దేవి ఫోన్ చేశారు. తనకు వై.ఎస్.ఆర్. క్రాంతి పధకం క్రింద లోన్ మంజూరైందని, కానీ మేనేజర్ నగదును ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ సమగ్ర విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామం నుంచి ఎస్.పుల్లయ్య ఫోన్ చేశారు. తమ గ్రామంలో లోఓల్టేజీ సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
- పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామం నుంచి వై. శ్రీనివాసులు ఫోన్ చేశారు. తమ గ్రామంలో కరెంటు స్థంభం వాలి ఉందని, తీగలు క్రిందకు వేలాడుతున్నాయని, ప్రజలకు
ఇబ్బందిగా ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, డి.ఆర్.ఓ. ఆర్. శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, గ్లోరియా, తదితరులు పాల్గొన్నారు.

