ముండ్లమూరు మండలంలో పలు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు .సమాజంలో ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని వారి బాధ్యతాయుతంలో తీర్చిదిద్దిన విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగి సమాజాభివృద్ధికి పాటుపడాలని వక్తలు అన్నారు. మండల కేంద్రమైన ముండ్లమూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి అని అన్నారు. ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థుల్లా అధ్యయనం చేస్తూ బోధించాలని ఆమె అన్నారు. ఉపాధ్యాయుడు సమాజాన్ని ప్రభావితం చేసే దిక్సూచి అని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ మాజీ ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి విస్తృత సేవ లు అందించారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, షేక్ హజరత్ అలీ, భావన్నారాయణ, ప్రభాకర్, ఏడుకొండలు, శివరామ కోటేశ్వరరావు, ఆంజనేయులు, చక్రపాణి, భారతీ, ప్రణతి ,శ్రీదేవి ,శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు అధ్యాపకులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.

