ఉపాధి హామీ పథకం చేపట్టిన పనులకు సంబంధించి పలు రికార్డులను ఒంగోలు క్లస్టర్ ఏపీడీ పి. వెంకటస్వామి పరిశీలించారు. తాళ్లూరు ఉపాధి హామీ కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలన్నారు. పనులు చేసిన అనంతరం ఆడిట్ కొరకు రికార్డులు సిద్ధం చేసే సమయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పని వారీగా రికార్డులు భద్రపరచాలన్నారు. ఏడు రకాల రికార్డులను తయారు చేసుకోవాలన్నారు. ఆడిట్ కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఏపీవో మురళి, ఈసీ ప్రసాద్, సాంకేతిక సహాయకులు రమేష్, కోటేశ్వరరావు, గురుబాబు, ఫీల్డ్ అసిస్టెంట్, సీవో వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.


