రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) గా స్వాగతిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న తమ చిరకాల డిమాండ్ కు ఆలస్యంగానైనా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు.
ఇళ్లస్తలాల కేటాయింపు కోసం విధివిధానాల రూపకల్పన సందర్భంలో అర్హులైన పాత్రికేయులందరికీ ఇళ్ళ స్థలాలు అందే విధంగా నిభందనలు ఉండేటట్లుగా చూడాలని వారు ప్రకటనలో కోరారు.
అక్రిడిటేషన్ల జారీలో కొన్ని అసంబద్ధ నియమాల కారణంగా ప్రస్తుతం వందలాదిమంది అర్హులైన పాత్రికేయులు అక్రెడిటేషన్ పొందలేక పోయారని, అలాంటి పాత్రికేయులందరికీ కూడా ఇళ్ళ స్థలాల కేటాయింపులో అవకాశం కల్పించే విధంగా నియమాలు రూపొందించాలని APUWJ గా కోరుతున్నామన్నారు.
